బీఆర్ఎస్ పాలసీ టూ లేట్... అప్పుడే వరాల జల్లు..?

by Disha Web Desk 12 |
బీఆర్ఎస్ పాలసీ టూ లేట్... అప్పుడే వరాల జల్లు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో:బీఆర్ఎస్ పాలసీ ప్రకటన మరింత లేట్ కానుంది. పార్టీ పాలసీలు ఎలా ఉండాలో వివిధ వర్గాల మేధావులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు అధినేత కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే ఆ ప్రక్రియ ఇప్పట్లో పూర్తవడం కష్టమని అభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే నెలలో ఢిల్లీలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్లతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, జర్నలిస్టులతో కేసీఆర్ భేటీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే పాలసీపై పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓ క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సుదీర్ఘ కసరత్తు తర్వాతే ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్, ఉచిత మంచినీరు, దళిత బంధు లాంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఖమ్మం సభా వేదికపై ప్రకటించారు. అయితే వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ఆలోచనలు ఏంటనే దానిపై సమగ్రమైన పాలసీ తయారీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు వివిధ వర్గాల మేథావుల అభిప్రాయాలు తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

దసరా రోజున పార్టీ ప్రకటించిన తర్వాత పాలసీ రూపకల్పనకు ఢిల్లీలో వివిధ వర్గాల మేథావులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థల సోదాల కారణంగా ఆ ప్రక్రియకు బ్రేకులు పడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పార్టీ ప్రకటించి నాలుగు నెలలు కావస్తున్నా పాలసీల రూపకల్పనకు ఎందుకంత ఆలస్యం అనే చర్చ అంతటా జరుగుతున్నది.

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ప్రచారం ఉంది. కర్ణాటకలో పోటీ చేయకుండా జేడీఎస్ కు మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ లోనూ పోటీకి రెడీ అవుతుందని ఓ సీనియర్ మంత్రి తెలిపారు. ఆ ఎన్నికల లోపు తమ పార్టీ ఎజెండా ఖరారు కానుందని వివరించారు.

Also Read....

జై తెలంగాణకు ఫుల్ స్టాప్! కేసీఆర్ నోటా వినిపించని పదం


Next Story

Most Viewed